కేటీఆర్ కు నెటిజన్ ప్రశంస

SMTV Desk 2019-08-14 18:11:22  

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా వీఐపీలు వినియోగించే బుగ్గకారుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా.. ట్రాఫిక్‌లో సాధారణ వ్యక్తి మాదిరిగానే ప్రయాణించానని వెల్లడించారు. తన కోసం ట్రాఫిక్‌ను ఎప్పుడూ నిలిపివేయలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వీఐపీల కోసం వినియోగించే బుగ్గ కార్లను నిషేధించక ముందు కూడా బుగ్గ కారును ఉపయోగించలేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ట్రాఫిక్‌లో సాధారణ వ్యక్తి మాదిరిగానే ప్రయాణించిన కేటీఆర్‌ను గమనించిన ఓ వ్యక్తి ట్విటర్‌లో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయణ్ని ప్రశంసించారు. కేటీఆర్ ఆ ట్వీట్‌కు బదులిస్తూ వివరణ ఇచ్చారు. ‘సార్‌ మీరు పంజాగుట్ట, బంజారా హిల్స్‌ మార్గాల్లో ప్రయాణిస్తూ.. సాధారణ వ్యక్తి మాదిరిగానే ఆ ట్రాఫిక్‌లో వెళ్లిపోయారు. అది కూడా ట్రాఫిక్‌ రద్దీ బాగా ఉన్న సమయాల్లో మీరు ఇలా చేశారు. మీరు ప్రయాణించిన మార్గంలో ఎక్కడా ట్రాఫిక్‌ను ఆపలేదు. ఇది నాకు చాలా సంతోషం కలిగించింది. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా’ అంటూ రాకేశ్‌ వర్మ అనే నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. రాకేశ్‌ ట్వీట్‌కు కేటీఆర్‌ ఈవిధంగా బదులిచ్చారు. ‘బ్రదర్.. నేనెప్పుడూ బుగ్గ కారును వినియోగించలేదు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక సాధారణ వ్యక్తి మాదిరిగానే ట్రాఫిక్‌లో ప్రయాణించాను. బుగ్గకార్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడానికి ముందు నుంచే వ్యక్తిగతంగా నేను దీన్ని పాటిస్తున్నాను’ అని కేటీఆర్ తెలిపారు. ట్విటర్‌లో కేటీఆర్‌ ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. చాలా మంది నెటిజన్లు కేటీఆర్ దృష్టికి అనేక సమస్యలను తీసుకొస్తుండగా.. ఆయన తనదైన శైలిలో వాటికి పరిష్కారం చూపిస్తూ అభిమానుల మనసు గెలుచుకుంటున్నారు.