సచిన్ తరువాత కోహ్లీనే!

SMTV Desk 2019-08-12 12:19:58  

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరో సంచలనం సృష్టించాడు. వెస్టిండీస్ పర్యటనలో ఈ రన్ మెషీన్ తన పరుగులతో రికార్డులన్నీ తుడిచిపెట్టాడు. ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో శతకం బాదిన విరాట్ కోహ్లీ (120: 125 బంతుల్లో 14x4, 1x6) దశాబ్దాలనాటి అరుదైన రికార్డుల్ని కనుమరుగు చేశాడు. మ్యాచ్‌లో 19 పరుగులు చేయడంతోనే 1993లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మియాందాద్ పేరిట ఉన్న రికార్డ్‌ని బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ.. 42వ శతకం బాదడం ద్వారా సచిన్ టెండూల్కర్ (49 వన్డే సెంచరీలు) రికార్డ్‌కి మరింత చేరువయ్యాడు. కాగా మ్యాచ్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (2: 3 బంతుల్లో), రోహిత్ శర్మ (18: 34 బంతుల్లో 2x4)‌తో పాటు రిషబ్ పంత్ (20: 35 బంతుల్లో 2x4) ఫెయిలైనా.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ ఏ దశలోనూ విండీస్ బౌలర్లకి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ (58 నాటౌట్: 55 బంతుల్లో 5x4)తో కలిసి నాలుగో వికెట్‌కి 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ టీమ్‌కి మెరుగైన స్కోరు అందించాడు. ఈ ఏడాది మార్చిలో ఆఖరిగా సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ ఈరోజు మూడంకెల స్కోరు అందుకోవడం ద్వారా.. భారత్ తరఫున సచిన్ తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆదివారం వరకూ సౌరవ్ గంగూలీ 11,363 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కానీ.. ఈరోజు విరాట్ కోహ్లీ 11,406 పరుగులతో గంగూలీని వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు.