తిరుపతి,ఆగస్ట్ 30 : భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తొలిసారి తిరుమలలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఆయన ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రూ. 25 కోట్లతో అంబేద్కర్ సిల్క్ డెవలప్మెంట్ అకాడమీకి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని దళితులకు భూ పట్టాలు పంపిణీ చేస్తారు. ఇక అక్కడి నుండి నేరుగా తిరుమలకు వెళ్లి బస చేయనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. మరుసటి రోజు ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని తిరిగి ఢిల్లీ వెళతారు. అయితే రాష్ట్రపతి పర్యటన నిమిత్తం తిరుమలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.