ఏపీలో భారీ వర్షాలు, కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. వరదలు, కరెంట్ కోతలతో ఏ పాములు ఎటువైపు నుంచి కొట్టుకొస్తాయో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో చాలా కుటుంబాలు నరకాన్ని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆపదలో ఉన్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తక్షణమే సహాయ, పునరావాస చర్యలు ప్రారంభించాలని కోరారు.
ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ..‘ఒక పక్క వరదలు, మరో పక్క కరెంటు లేదు. ఏ పాములు కొట్టుకొస్తాయో తెలీదు. పిల్లా పాపలతో కుటుంబాలు నరకాన్ని చూస్తున్నాయి. దయచేసి ఆపదలో ఉన్న ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. తక్షణమే సహాయ, పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఓ సామాన్యుడు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్న వీడియోను తన ట్వీట్ కు జతచేశారు.