యూపీ, ఆగస్ట్ 30 : గోరఖ్ పూర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లోపం కారణంగా ఇటీవల 72 మంది చిన్నారులు మరణించిన విషయం మరువక ముందే మరో సంఘటన వెలుగు చూసింది. గడిచిన 48 గంటల వ్యవధిలో 42 మంది చిన్నారులు కన్నుమూసి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చారు. పూర్తి వివరాలలోకి వెళితే.. మరోసారి గోరఖ్ పూర్ లోని బీఆర్డీ ఆసుపత్రిలో ఏడుగురు చిన్నారులు మెదడు వాపు వ్యాధి కారణంగా, ఇతరత్రా వ్యాధులతో మిగతా చిన్నారులు మరణించారని వైద్యులు వెల్లడించారు. ఈసారి ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లోపాలు లేవని, 350 మంది చిన్నారులు వివిధ వ్యాధులతో చికిత్స పొందుతున్నట్లు బీఆర్డీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ పీకే సింగ్ తెలిపారు. వారిని కాపాడేందుకు మేము శాయశక్తులా ప్రయత్నిస్తున్నా౦ కాని చివరి దశలో వారిని ఆసుపత్రికి తీసుకువస్తు౦డడంతో మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుందని ఆయన స్పష్టం చేసారు. ఈ మరణాలపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.