ప్రశ్నిస్తే మా ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వగలరా?

SMTV Desk 2019-08-01 15:15:02  

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార ఘటన మరోసారి చర్చనీయాంశమైంది. రాయబరేలి జైల్లో ఉన్న తన బంధువును కలవడానికి వెళ్లిన బాధితురాలు ప్రయాణిస్తోన్న కారు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో దీనిని హత్యాయత్నంగా భావిస్తున్నారు. ఇది జరగడానికి ముందే తనను నిందితుల బంధువులు బెదిరిస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు బాధిత యువతి లేఖ రాసింది. ఈ లేఖ రాసిన పది రోజుల తర్వాత ప్రమాదం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా, ఇదే అంశంపై ఓ ఇంటర్ విద్యార్థిని అడిగిన ప్రశ్నతో పోలీసులు నీళ్లునమిలారు. మహిళల భద్రతపై ఓ పాఠశాలలో పోలీసు అధికారులు ప్రసంగిస్తుండగా ఆ విద్యార్థిని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. పోలీస్‌ భద్రత వారోత్సవాల్లో భాగంగా యూపీలోని బారాబంకీ పోలీసులు వివిధ పాఠశాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆనంద్ భవన్‌ పాఠశాలకు వెళ్లారు. ఈ సమయంలో ఆ స్కూల్‌లోని ఇంటర్ విద్యార్థిని అడిగిన ప్రశ్నతో సమాధానం చెప్పడానికి ఉన్నతాధికారి ఇబ్బందిపడ్డారు. మహిళల భద్రతపై విద్యార్థులకు ఏసీపీ గౌతమ్ సూచనలు చేస్తుండగా మునిబా కిద్వాయ్‌ అనే విద్యార్థిని ప్రశ్న సంధించింది.

‘జరిగిన అన్యాయాలపై మాట్లాడాలని, ఆందోళన చేయాలని చెప్తున్నారు సరే, మీకు తెలుసు కదా ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు జరిగిన రోడ్డు ప్రమాదం కేవలం ప్రమాదం కాదని అందరికీ తెలుసు. ట్రక్‌ నంబరు కనిపించకుండా నల్ల రంగు పూశారు. బలవంతుడైన వ్యక్తికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినా ప్రయోజనం ఉండదు. ఒకవేళ పోలీసులు చర్య తీసుకున్నా ఉపయోగం ఉండదని మాకు తెలుసు. ప్రస్తుతం ఆ యువతి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మేము ఆ ఘటనకు వ్యతిరేకంగా మాట్లాడినా మీరెలా న్యాయం చేయగలరు? నా రక్షణకు మీరెలా గ్యారంటీ ఇవ్వగలరు?’ అని నిలదీసింది.

బాలిక ప్రశ్నతో ఏసీపీ ఖంగుతిన్నారు. ఒక నిమిషం పాటు గుక్కతిప్పుకోకుండా విద్యార్థిని నిలదీసిన తీరుపై మిగతా విద్యార్థులంతా కరతాళధ్వనులతో ఆమెను ప్రశంసించారు. కాగా, బాధితురాలు రాసిన లేఖపై తనకు మీడియా ద్వారా తెలిసిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ బుధవారం అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జులై 12న రాసిన లేఖ తనకు చేరుకపోవడంపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆయన వివరణ కోరారు. ఇదిలా ఉండగా, ఉన్నావ్ బాధితురాలి కుటుంబ సభ్యులకు బెదిరింపులు వచ్చాయని, దానిపై వారు మొత్తం 25 ఫిర్యాదులు చేశారని సీనియర్ పోలీసు అధికారి ఎంపీ వర్మ వెల్లడించారు. వాటిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.