ఉత్తరకొరియా, ఆగస్ట్ 30: మంగళవారం ఉత్తరకొరియా చేపట్టిన మిస్సైల్ టెస్ట్ కారణంగా ఇటు జపాన్ తీవ్ర ఆందోళన బాట పట్టగా, అటు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవి చూసిన సంగతి తెలిసిందే. అయితే బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టడంపై ఉత్తరకొరియా అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉత్తర్వుల మేరకు ఆయన పేర్కొన్న లక్ష్యం ప్రకారమే ప్రయోగం చేశామని ప్రకటనలో వెల్లడించింది. గువాం ద్వీపాన్ని టార్గెట్గా చేసి క్షిపణి ప్రయోగం చేసినట్లు ఉత్తరకొరియా పేర్కొంది. దీనితో పాటు ప్రయోగానికి ఉపయోగించిన క్షిపణి మిడిల్ రేంజ్ మిస్సైల్ అని, దాని పేరు హస్వాంగ్-12 అని తెలిపింది. ప్యాంగ్ యాంగ్ నుంచి జపాన్ ఉత్తర భూభాగం మీదుగా ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలోకి ఈ క్షిపణిని ప్రయోగించమని అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. నాలుగు హస్వాంగ్-12 మిస్సైల్స్ను ప్రయోగిస్తే సుమారు 1.60లక్షల జనాభా ఉన్న గువాం ప్రపంచ పటంలో కనిపించదని ఈ సందర్భంగా తెలిపింది. ఈ గువాం ద్వీపంలో అమెరికా నెవీ, ఎయిర్ ఫోర్స్ల బేస్ క్యాంప్లు స్థాపించబడి ఉన్నాయి.