భారత జట్టు త్వరలో విండీస్ పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనకు మొదట జట్టు కెప్టన్ విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇచ్చేందుకు నిర్ణయించగా...మళ్ళీ అతన్ని పర్యటనకు సిద్దం చేశారు. ఈ మేరకు కోహ్లీ విండీస్ సిరీస్కు అందుబాటులో ఉంటానని స్వయంగా బీసీసీఐకి తెలిపినట్లు సమాచారం. మెగాటోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆటగాళ్లు ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జట్టులోని లోపాలని సవరించుకుని మరింత బలోపేతం చేయాలని భావించి కోహ్లీ ఈ పర్యటనకు సిద్ధమయ్యాడు. విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాల్సిందిగా సూచనలు వచ్చాయి. కానీ ఇలాంటి కీలక పరిస్థితుల్లో జట్టుతోనే ఉండాలని రికార్డుల రారాజు నిర్ణయం తీసుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ యువ ఆటగాళ్లకు పెద్దపీట వేసింది. నవదీప్ సైని, రాహుల్ చాహర్, దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. వచ్చే నెలలో విండీస్తో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది.