శ్రీలంక, ఆగస్ట్ 30: వరుస ఓటములు ఎదుర్కొంటున్న శ్రీలంకకు మరో దెబ్బ తగిలింది. సొంత గడ్డపై ఆడి ఇటు టెస్ట్ సిరీస్, అటు వన్డే సిరీస్ రెండింటిలో కూడా పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంక జాతీయ సెలక్టర్లు ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ కలిసి గట్టుగా రాజీనామాలకు సన్నద్ధమయ్యారు. అయితే ఈ ఆందోళనకర సంఘటన చోటుచేసుకున్న కొద్ది సమయానికే మూడో వన్డేకు సారధిగా వ్యవహరించిన చమర కపుగెదెరపై బోర్డు విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది. పల్లెకెల వేదికగా ఆదివారం జరిగిన మూడవ వన్డేలో జట్టు నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాటింగ్ ఎన్నుకున్న అంశంపై కపుగెదెర విచారణకు హజరుకావల్సిన పరిస్థితి ఎదురైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు సమావేశంలో టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే టాస్ గెలిచిన అనంతరం శ్రీలంక మూడో వన్డే తాత్కాలిక సారథి అయిన కపుగెదెర జట్టు నిర్ణయాన్ని పక్కనపెట్టి బ్యాటింగ్ ఎన్నుకున్నాడు. దీంతో ఛేజింగ్ చేసి విజయం దిశగా అడుగులు వేయాలనుకున్న జట్టు ఆశలు అడియాశలయ్యాయి. సిరీస్పై ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో తప్పుడు నిర్ణయం తీసుకున్న కపుగెదెరపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కపుగెదెరపై విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా కెఫ్టెన్ తరంగపై వేటు పడిన సంగతి తెలిసిందే.