న్యూఢిల్లీ : ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం నుంచి ఎస్బిఐ ఆన్లైన్ సేవలు ఆగిపోయాయంటూ వినియోగదారులు ట్విట్టర్ ద్వారా ఎస్బిఐకు ఫిర్యాదులు పంపారు. స్మార్ట్ఫోన్లలో ఎస్బిఐ ఆన్లైన్ సేవలకు ఉపయోగించే యోనో యాప్ కూడా పనిచేయలేదు. అయితే ఈ అంతరాయాలపై బ్యాంకు వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నవేళ వినియోగదారులు ఎక్కువగా ఆన్లైన్ ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సేవలు నిలిచిపోవడం వారికి ఇబ్బందికరంగా మారిందని, ఖాతాదారులంతా ఫిర్యాదుల కొరకు సామాజిక మాధ్యమాలను ఆశ్రయించారు. దీంతో ఎస్బిఐ ట్విట్టర్ ఖాతా ఫిర్యాదులతో నిండిపోయింది.