ప్రపంచకప్ మెగా టోర్నమెంట్ లో భాగంగా శనివారం ఇండియా-ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ కొంతమేర భారత్ కు చుక్కలు చూపించింది. టోర్నీలో ఇండియా తొలి ఓటమిని నమోదు చేసేలా కనిపించింది. కానీ చివరకు బుమ్రా, షమీ పేస్తో వారిని పడగొట్టడంతో 11 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మీడియాతో మాట్లాడుతూ... భారత జట్టు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనిపై సచిన్ పెదవి విరిచాడు. మ్యాచ్ విశ్లేషణలో భాగంగా సచిన్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన నన్ను నిరాశపరిచింది. ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. ధోని, కేదార్ జాదవ్ల భాగస్వామ్యం పట్ల కూడా నేను సంతోషంగా లేను. వారిద్దరు చాలా నెమ్మదిగా ఆడారు. 34 ఓవర్లకు కేవలం 119 పరుగులే చేశాం.అప్పటి నుంచే మనం వెనుకబడ్డాం. సీనియర్ ఆటగాడు అయి ఉండి ధోని కూడా పాజిటివ్గా కనిపించలేదు అని ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నాడు. ఈ క్రమంలో ధోని ఫ్యాన్స్ సచిన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సచిన్ కంటే ధోనీనే ఎన్నో రెట్లు గొప్ప ఆటగాడు.90వ దశకంలో జట్టులో స్థానం కోసం పోరాడాల్సి వచ్చిన వ్యక్తి తాను మాత్రమే బిగ్ హిట్టర్నని భావిస్తున్నాడు. ఎన్నో ప్రపంచకప్లు ఆడినా ధోనీ వచ్చేదాకా ఒక్కటీ గెలవలేదు. మేటి ఆటగాళ్లంతా ఉన్నా సచిన్కు సాధ్యం కానిది ధోని అతడికి కానుకగా ఇచ్చాడు అంటూ సచిన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే విధంగా ఇద్దరి బయోపిక్లకు పోలుస్తూ.. ప్రేక్షకులతో నిండిన, ఖాళీగా ఉన్న స్టేడియం ఫొటోలను షేర్ చేస్తున్నారు.