నంద్యాల, ఆగస్ట్ 29: నంద్యాల ఉపఎన్నికల్లో తన అన్న గెలుపుపై ఏపీ మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ... నంద్యాల ఓటర్లు అభివృద్ధికి పట్టంకట్టారని, మరింత అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తామని ఆమె తెలిపారు. తన అన్న గెలుపు సీమ రాజకీయాల్లో మార్పు తెస్తుందని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు లేని తమను ప్రజలు ఆదరించారని, ఎల్లప్పుడూ వారి వెంటే ఉంటామని ఆమె తెలిపారు. నంద్యాల విజయంలో యువత, మహిళలదే కీలకపాత్ర అని, ప్రజలు తమను నమ్మారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయమని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు, తన డ్రెస్ కోడ్ పై రోజా చేసిన వ్యాఖ్యలు ప్రజలను చాలా బాధపెట్టాయని ఆమె చెప్పారు. తన చుడీదార్ పై రోజా చేసిన కామెంట్స్ ఆమెకే రివర్స్ కొట్టాయని, ఎనభై శాతం మహిళలు చుడీదార్లే వేసుకుంటున్న విషయాన్ని ఎమ్మెల్యే రోజా గమనించాలని ఆమె సూచించారు.