ఐఆర్సీటీసీ గురించి అందరికి తెలిసిందే. ఈ సర్వీసులో కేవలం ట్రైన్ టికెట్లను బుకింగ్ చేసుకోవడమే కాకుండా అనేక రకాల సౌకర్యాలను పొందవచ్చు. తత్కాల్ టికెట్ బుకింగ్, హోటల్ బుకింగ్, దివ్యాంగ్ కోటా కింద రిజర్వేషన్స్, సీనియర్ సిటిజన్స్కు రాయితీ వంటి పలు సేవలు పొందొచ్చు. అంతేకాకుండా ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులు వారి బోర్డింగ్ స్టేషన్ (ట్రైన్ ఎక్కే స్టేషన్) మార్చుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. రిజర్వేషన్ టికెట్లకు ఇది వర్తిస్తుంది. ఐఆర్సీటీసీ నిబంధనల ప్రకారం.. ప్యాసింజర్ ట్రైన్ బయలు దేరడానికి 24 గంటల ముందే ఆన్లైన్లో బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవల్సి ఉంటుంది. బోర్డింగ్ స్టేషన్ మారిన తర్వాత ఇక కొత్త బోర్డింగ్ స్టేషన్లో ప్రయాణికులు ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది.
ఐఆర్సీటీసీ బోర్డింగ్ స్టేషన్ మార్పు నిబంధనలు 2019:
✺ బోర్డింగ్ స్టేషన్ మార్చుకున్నందుకు పెనాల్టీతోపాటు కొత్త బోర్డింగ్ స్టేషన్ నుంచి పాత బోర్డింగ్ స్టేషన్కు మధ్య ఉన్న దూరానికి చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
✺ ఒక పీఎన్ఆర్పై ఒకసారి మాత్రమే బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవడం వీలవుతుంది. వికల్ప్ ఆప్షన్తో ఉన్న పీఎన్ఆర్కు ఈ సదుపాయం వర్తించదు.
✺ ట్రైన్ బయలు దేరడానికి 24 గంటల ముందే బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవాలి. 24 గంటలోపు అయితే వీలవ్వదు.
✺ సీజ్ అయిన ట్రైన్ టికెట్లకు ఇది వర్తించదు. కరెంట్ బుకింగ్ టికెట్, ఐటికెట్లకు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోలేం.