హిట్ మ్యాన్....వన్ మ్యాన్ షో!

SMTV Desk 2019-06-06 12:46:15  rohit sharma, india vs south africa

బుధవారం ఇంగ్లాండ్ వేదికగా దక్షిణాఫ్రికాతో ప్రపంచకప్ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ ఆడిన టీంఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో 128 బంతుల్లోనే 10x4, 2x6 సాయంతో 100 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. వన్డే కెరీర్‌లో 23 శతకాన్ని అందుకున్నాడు. దీంతో.. అరుదైన రికార్డుల్లోనూ రోహిత్ నిలిచాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్‌లుగా సచిన్ టెండూల్కర్ (49 శతకాలు), విరాట్ కోహ్లి (41) టాప్-2లో ఉండగా.. తాజాగా సౌరవ్ గంగూలీ (22)ని వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ 23 శతకాలతో మూడో స్థానానికి ఎగబాకాడు. అలానే ఛేదనలో అత్యధిక సెంచరీలు బాదిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గానూ రోహిత్ నిలిచాడు. ఛేదనలో విరాట్ కోహ్లి 25 సెంచరీలు సాధించగా.. సచిన్ 17, క్రిస్‌గేల్ 12, దిల్షాన్, రోహిత్ శర్మ సంయుక్తంగా 11 శతకాలతో నాలుగో స్థానంలో నిలిచారు. మ్యాచ్‌లో రోహిత్ శర్మ (122 నాటౌట్: 144 బంతుల్లో 13x4, 2x6) అజేయ శతకం బాదడంతో దక్షిణాఫ్రికాని 6 వికెట్ల తేడాతో భారత్ చిత్తుగా ఓడించేసింది. తొలుత స్పిన్నర్ చాహల్ (4/51), పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా (2/35), భువనేశ్వర్ కుమార్ (2/44) చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 227 పరుగులే చేయగలిగింది. అనంతరం ఛేదనలో టాప్ ఆర్డర్ నుంచి ఆశించినంత సహకారం లభించకపోయినా.. పట్టుదలతో క్రీజులో నిలిచిన రోహిత్ శర్మ 47.3 ఓవర్లలోనే టీమిండియాకి 230/4తో చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.