భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు మరో సమరానికి సిద్దమయ్యింది. నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నమెంట్లో సింధు మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో ప్రపంచ 56వ ర్యాంకర్, క్వాలిఫయర్ చౌరున్నిసా (ఇండోనేసియా)తో సింధు తలపడనుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ ఏడాదే జరిగిన ఆసియా చాంపియన్షిప్లో చౌరున్నిసాతో ఆడిన సింధు వరుస గేముల్లో గెలుపొందింది. ఈ సీజన్లో సింధు మొత్తం ఆరు టోర్నమెంట్లలో బరిలోకి దిగింది. కానీ ఏ టోర్నమెంట్లోనూ ఫైనల్కు చేరుకోలేకపోయింది. 23 ఏళ్ల సింధు ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో తొలి రౌండ్లో. ఇండియా ఓపెన్లో సెమీఫైనల్లో. మలేసియా ఓపెన్లో ప్రిక్వార్టర్ ఫైనల్లో. సింగపూర్ ఓపెన్లో సెమీఫైనల్లో. ఆసియా చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది.