అలనాటి బాలీవుడ్ ప్రముఖ నటుడు దిన్యర్ కాంట్రాక్టర్ ఈరోజు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’, ‘దిల్ విల్ ప్యార్ వ్యార్’, ‘ఖిలాడీ’, ‘బాద్షా’ వంటి ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రల్లో నటించిన దిన్యర్ ను ఈ ఏడాది జనవరిలోనే భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించుకుంది. ఆయన మరణ వార్త తెలిసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా ఆయనకు సంతాపం తెలిపారు. ‘పద్మశ్రీ దిన్యర్ కాంట్రాక్టర్ ఓ నటుడిగా ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు పండేవి. థియేటర్, టీవీ, సినిమా ఇలామీడియం ఏదైనా సరే తన అద్భుతమైన నటనతో ఎందరో ముఖాలపై చిరునవ్వులు పూయించారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అయన పేర్కొంటూ దిన్యర్కు షేక్హ్యాండ్ ఇస్తున్నప్పుడు దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.