చైనా, ఆగస్టు, 29 : భారత్ పై చైనా ఇంకా తన పద్ధతి మార్చుకోవడం లేదు. చైనా, భారత్, భూటాన్ సరిహద్దులోని డోక్లాంలో ఏర్పడిన ఉద్రిక్తతల పరిస్థితి మేరకు భారత ఆర్మీనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేదంటే యుద్ధం తప్పదంటూ ఇన్ని రోజులూ హెచ్చరికలు చేసుకుంటూ చివరకు వెనక్కుతగ్గి ఇరు సైన్యాలు ఒకే సమయంలో అక్కడినుంచి వెళ్లిపోవాలనే సూచనను ఒప్పుకున్న విషయం విధితమే. ఈ నెల 28న డోక్లాం నుంచి చైనా బుల్డోజర్లు, రోడ్డు నిర్మాణ యంత్రాలు కూడా వెనక్కు వెళ్లిపోయాయి. దీంతో చైనా తమదే పై చేయి అనేలా ప్రవర్తిస్తోంది. తాజాగా భారత్కు మరోసారి హెచ్చరికను పంపింది. డోక్లాం ప్రతిష్టంభన ఘటన నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలంటూ వ్యాఖ్యలు చేయడంతో, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఓ అధికారి నేడు మీడియాతో మాట్లాడుతూ... తమదనే సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సరిహద్దుల్లో తమ ఆర్మీ గస్తీ నిర్వహిస్తూనే ఉంటుందన్నారు. దేశ సరిహద్దుల్లో శాంతి పూరిత వాతావరణం కొనసాగేందుకు తాము నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని వెల్లడించారు. సెప్టెంబర్ 3న చైనాలో జరిగే బ్రిక్స్ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో చైనా, భారత్ ఆర్మీ అధికారులు డోక్లాం విషయమై మరోసారి భేటీ కానున్నారు.