హైదరాబాద్, ఆగస్ట్ 29 : కథానాయకుడుగా ఎన్నో సినిమాలు చేసిన అక్కినేని నాగార్జున బుల్లితెర మీద వ్యాఖ్యాతగా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. బుల్లితెర మీద వ్యాఖ్యాతగా రాణించడం ఎంత కష్టమో తనకు తెలుసన్నారు. "మీలో ఎవరు కోటీశ్వరుడు" అనే కార్యక్రమాన్ని తనదైన శైలిలో హోస్ట్ చేస్తూ.. ప్రేక్షకుల అభినందనలను అందుకున్నారు. అయితే తాజాగా ఆయన "బిగ్ బాస్" అనే కార్యక్రమాన్ని చూస్తున్నానని, అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా బాగా హోస్ట్ చేస్తున్నాడని చెప్పారు. ఎన్టీఆర్ తను తీసే సినిమాల్లో ఎంత ఎనర్జీగా ఉంటారో, బుల్లితెర మీద కూడా అంతే ఎనర్జీతో కనిపిస్తున్నాడని తెలిపారు. అసలు ఎంతో కష్టమైన పనిని తనదైన స్టైల్ లో చాలా ఈజీగా చేస్తుండడం ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని పొగడ్తల వర్షం కుమ్మరించారు. ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న తీరు, సమయస్పూర్తి చాలా బాగున్నాయని నాగార్జున అభినందించారు.