మెక్డొనాల్డ్స్ ఇండియా ఫుడ్ ఔట్లెట్లో ఓ వ్యక్తి బర్గర్ తిని ఆసుపత్రి పాలయ్యాడు. ఢిల్లీలో నివసిస్తున్న సందీప్ సక్సేనా అనే వ్యక్తి 2014 జూలై 10న నోయిడాలోని జీఐపీ మాల్లో ఉన్న మెక్డొనాల్డ్ ఔట్లెట్లో బర్గర్ తినేటప్పుడు అతనికి అందులో పురుగులు కనిపించాయి. దీంతో అతనికి వాంతులు అయ్యాయి. అయితే ఈ విషయంపై ఔట్లెట్ మేనేజర్ను సంప్రదించినా ఎటువంటి లాభం లేకపోయింది. దీంతో పోలీసులను పిలిచారు. తరువాత జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీస్కు వెళ్లారు. చివరకు ఫుడ్ ఇన్స్పెక్టర్కు విషయం తెలియజేయడంతో ఆయన ఔట్లెట్కు వచ్చి విషయాన్ని ఆరా తీశారు. బర్గర్ను ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కు పంపారు. సక్సేనా వాంతుల అవుతుండటంతో హాస్పిటల్కు వెళ్లారు. అక్కడ వైద్యులు ఆహారం కారణంగానే వాంతులు అయినట్లు తేల్చారు. బర్గర్లో పురుగుల ఉన్న విషయాన్ని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ కూడా ధ్రువీకరించింది.దీంతో డిస్ట్రిక్ ఫోరమ్ బాధితుడికి రూ.70,000 పరిహారం చెల్లించాలని మెక్డొనాల్డ్ను ఆదేశించింది. కానీ మెక్డొనాల్డ్ స్పందించలేదు. దీంతో విషయం ఢిల్లీ స్టేట్ కన్సూమర్ వివాదాల పరిష్కార కమిషన్ వద్దకు చేరింది. ఇక్కడ మెక్డొనాల్డ్స్ తనకు నోటీసులు అందలేదని బుకాయించింది. కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిస్ట్రిక్ ఫోరమ్ ఆదేశాలను సమర్థించింది. పరిహారం చెల్లించాలని ఆదేశించింది.