అఖండ విజయం సాధించాం

SMTV Desk 2019-06-05 15:07:06  ktr

తెలంగాణలో జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కారు హవా నడుస్తోంది. 32 జెడ్పీ పీఠాల మీద గులాబీ జెండా ఎగిరింది. 32కు 32 జెడ్పీ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుని సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మూడు జిల్లాల్లో మూడు స్థానిక కోటా ఎమ్మెల్సీ సీట్లను నిన్ననే టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మా ముగ్గురు అభ్యర్ధులకు అభినందనలు. మా అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా పోలైన ఓట్లలో 96 శాతం సాధించి రికార్డ్ సృష్టించారు. ఇందుకు కొనసాగింపుగా ఈరోజు అసాధారణ విజయం వరించింది. ఇదొక చారిత్రక విజయం. అసాధారణమనే చెప్పాలి. అఖండ విజయం సాధించాం. ఈ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ కేటీఆర్ వివరించారు.

అంతేకాకుండా ఇది టీఆర్ఎస్ చరిత్రలోనే అది పెద్ద విజయమని టీఆర్ఎస్ శ్రేణులను ఉత్సాహపరిచేలా మాట్లాడారు. బహుశా దేశ స్థానిక ఎన్నికల చరిత్రలో ఇంతటి తీర్పు ఎక్కడా చూసి ఉండమని ఆయన అన్నారు. ఎన్నిక ఏదైనా కేసీఆర్ నాయకత్వాన్నే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారనడానికి ఈ ఫలితాలు నిదర్శనమని తెలిపారు. చాలా జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీలు ఖాతాలు తెరవలేదని.. అన్ని జెడ్పీ పీఠాలు గెలవడం అద్భుతమని వెల్లడించారు. ఉత్తమ్, భట్టి నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించిందని.. పార్లమెంట్ ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఓటింగ్ లో తేడా కనిపించిందని కేటీఆర్ స్పష్టం చేశారు.