దైవ దర్శనం కోసం గుడికి వెళుతున్న ఓ వివాహితపై ఐదుగురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలిపై అత్యాచారం చేసిన సమయంలో తీసిన వీడియోలను నిందితులు సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. రాజస్థాన్ లోని పాలి జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత నెల 26న తను స్నేహితురాలితో కలిసి గుడికి వెళుతుండగా ఐదుగురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని బాధిత వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో నిందితులుగా భావిస్తున్న జితేంద్ర భట్ (20), గోవింద్ భట్ (20), దినేశ్ భట్ (24), మహేంద్ర భట్ (22)లను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు సంజయ్ భట్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. సదరు బాధిత వివాహితకు వైద్య పరీక్షలు చేయించినట్టు వారు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.