తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నల్గొండ జిల్లా హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి కేసులో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. ముగ్గురు అమ్మాయిలతో పాటూ మరో వేశ్యను అతి కిరాతకంగా చంపిన సైకో మరో జంటను దారుణంగా హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా ఈ జంట కనిపించుకుండా పోయినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారట. వరంగల్కు చెందిన భార్యాభర్తల్ని మామిడితోటల్లో పని ఇప్పిస్తానని శ్రీనివాసరెడ్డి తీసుకొచ్చాడు. మామిడి తోటల్లో పని ఇప్పించక లిఫ్ట్ మెకానిక్ పనిలో సాయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి జంట కనిపించడంలేదని పోలీసులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారట. ఈ అనుమానాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దంపతుల మిస్సింగ్ మిస్టరీపై ఆరా తీస్తున్నారు.. ఈ జంట ఎలా మాయమయ్యిందో శనివారం నుంచి కస్టడీలో ఉన్న శ్రీనివాసరెడ్డి నుంచి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారట. అలాగే వారి బంధువుల్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీనివాసరెడ్డి తన మొబైల్లో ఎక్కువగా పోర్న్ వెబ్సైట్లు చూసేవాడని పోలీసుల విచారణలో తేలిందట. అశ్లీల వెబ్సైట్ల సెర్చింగ్లే ఎక్కువ ఉందని.. ఈ సైట్లకు సంబంధించిన డేటా అతడి ఫోన్లో ఉన్నట్లు తెలుస్తోంది.