ఆయనో డాక్టర్, కాలం కలిసి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఏకంగా కేంద్ర కేబినేట్ మినిస్టర్ అయ్యారు, అందుకే ఆయన బాధ్యతల స్వీకారానికి ఆరోగ్యం, పర్యావరణ హితానికి ఉపయోగపడే సైకిల్ మీద కార్యాలయానికి విచ్చేశారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీచౌక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన డాక్టర్ హర్షవర్థన్కు కేంద్రమంత్రి వర్గంలో చోటు లభించిన విషయం తెలిసిందే. వృత్తిరీత్యా డాక్టర్ కావడం వల్ల బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే ఆరోగ్యకరమైన సూత్రాలు పాటించడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలవాలని భావించారు. పైగా ఈరోజు వరల్డ్ సైకిల్ డే కావడంతో సైకిల్పై తన కార్యాలయానికి వచ్చి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ సైకిల్ అందుబాటులో ఉన్న రవాణా సాధనమేకాక ఆరోగ్యకరమైన అలవాటని అన్నారు. ఆరోగ్యమైన భారతవాని కోసం మోదీ దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రజలందరికీ చేరేలా చూస్తామని హామీ ఇచ్చారు.