ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో మహిళలకు బస్సుల్లో, మెట్రో రైల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్సిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఢిల్లీలో మహిళల భద్రత, సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. కాగా..టిక్కెట్టు కొనగలిగిన స్థోమత ఉన్నవారు టిక్కెట్టుకు డబ్బు చెల్లించవచ్చని అన్న కేజ్రీవాల్ దీంతో మరొకరు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకునే వెసలుబాటు ఉంటుందని అన్నారు. అయితే టిక్కెట్ ధరలను పెంచవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరామని తెలిపిన కేజ్రీవాల్..పెంచిన ధరలను ఫిఫ్టీ-ఫిఫ్టీ పార్టనర్ షిప్ గా భరిస్తామని తెలిపినప్పటికీ కేంద్రం తమకు సహకరించలేదన్నారు.దీంతో తామే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు..అయితే ఈ విషయంలో కేంద్రప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదని తెలిపారు.