ముంబయి: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తన క్రికెట్ కెరీర్లో ఎప్పుడూ మర్చిపోలేని కొన్ని సంఘటనలు గుర్తుచేసుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలో తనకు దక్కిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పోగొట్టుకొని మళ్ళీ తిరిగి దక్కించుకున్నాడు. 2003లో పాకిస్తాన్ తో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో సచిన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. దాయాది జట్టుతో జరిగిన మ్యాచ్లో సచిన్ వీరోచితంగా పోరాడి 98 పరుగులు చేసి పాక్ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లందరూ బయటకి వెళ్లి ఓ చైనీస్ హోటల్ లో డిన్నర్ చేశారు. అయితే తన చేతిలో ఉన్న ఓ పార్శిల్ను సచిన్ తన ఫ్రెండ్కు ఇచ్చాడు. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. చైనీస్ హోటల్ నుంచి అందరూ తమ గదులకు చేరుకున్న తర్వాత తన ఫ్రెండ్ను పార్శిల్ ఇవ్వమని సచిన్ అడిగాడు. అయితే తిన్న చోటే పార్శిల్ కవర్ మర్చిపోయానని ఆయన సచిన్తో ఆందోళనగా చెప్పాడు. వెంటనే ఆ హోటల్ నంబర్ సంపాదించి అక్కడకు ఫోన్ చేస్తే వారు ఆ పార్శిల్ను సచిన్కు అప్పగించారు. దీంతో సచిన్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతకీ ఆ పార్శిల్ కవర్లో ఉన్నవేంటో తెలుసా..!.అప్పటివరకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల కింద వచ్చిన మూడు బంగారు వాచీలు.