వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలి ... జేసీ డిమాండ్

SMTV Desk 2019-06-03 15:39:38  JC divakar reddy,

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడి చేయడంతో అనంతపురం జిల్లాలోని యాడికి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. యాడికి మండలం కొనుప్పాలపాడులో టీడీపీ వర్గీయులపై మీద వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్పత్రిలో పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారని, అకారణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడికి దిగుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. దాడికి దిగింది వైసీపీ వర్గీయులేనని ఆరోపించిన జేసీ, తక్షణం వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రెండ్రోజుల క్రితం జిల్లాలోని బత్తలపల్లి మండలం పత్యాపురంలో కూడా టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికంగా ఓ అంగన్వాడీ భవనం స్థలం వివాదంగా మొదలైన గొడవ కాస్త రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది. వైసీపీ వర్గాలు ఘర్షణలో టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడడంతో టీడీపీ కార్యకర్త రాజప్ప మృతి చెందగా మరో ఐదుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.