కొనసాగుతున్న సీబీఐ సోదాలు

SMTV Desk 2019-06-03 15:05:16  sujana choudary,

కేంద్ర మాజీమంత్రి సుజనాచౌదరి ఇల్లు, ఆఫీసులో సీబీఐ, ఈడీ సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి హైదరాబాద్‌లోని సుజనా ఇల్లు, ఆఫీసులో తనిఖీలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలో ‘బెస్ట్‌ అండ్ కాంప్టన్‌’ పేరుతో సుజనా వ్యాపారం నిర్వహించారు. తప్పుడు ఇన్‌ వాయిస్‌లతో రుణాలు పొందినట్లు ఆరోపణలు వస్తుండడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా గతం లోనూ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీకి సీబీఐ బదిలీ చేసింది. ఆంధ్రా బ్యాంక్‌ కు రూ.71 కోట్ల రుణం ఎగవేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కాగా మొత్తం ఐదుగురు డైరెక్టర్లు, ఎండీలపై బెంగళూరు సీబీఐ కేసు నమోదు చేసింది. శనివారం మధ్యాహ్నం సుజనా గ్రూప్‌ డైరెక్టర్లు నలుగురిని అదుపులోకి తీసుకొన్న అధికారులు సుధీర్ఘంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాగుట్ట నాగార్జున హిల్స్‌ లోని సుజనా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఆఫీసును సీబీఐ అధికారులు సీజ్‌ చేశారు. కాగా ఈ రోజు రాత్రి వరకూ సోదాలు కొనసాగుతాయని తెలుస్తోంది. ఇంతవరకూ ఈ సోదాలకు సంబంధించి అటు సీబీఐ కానీ.. ఇటు ఈడీ అధికారులు గానీ మీడియా మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈరోజు రాత్రిలోపు ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.