ప్రపంచకప్ 2019లో ఆడిన తొలి మ్యాచ్లోనే రెండు వికెట్లు పడగొట్టిన వెస్టిండీస్ పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్ తాను ఆల్రౌండర్ని అని మరోసారి క్రికెట్ అభిమానులకు గుర్తుచేశాడు. పాకిస్థాన్తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన రసెల్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మెయిడిన్ కూడా ఉండటం విశేషం. ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ టీమ్ ఘన విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘చాలా మంది నేను ఓ బిగ్హిట్టర్నని చెబుతుంటారు. వారందరికీ తెలియనిది ఏమిటంటే నేను ఓ ఫాస్ట్ బౌలర్ను. అందరూ నన్ను తక్కువ అంచనా వేసారు. నన్నందరూ మీడియం పేసర్గా పరిగణిస్తుంటే అసూయ పుట్టేది. నేను బంతి అందుకోవడానికి వచ్చినప్పుడు స్క్రీన్పై ‘మీడియం పేసర్’ అని కనిపించేది. అప్పుడు నాకు తెగ కోపం వచ్చేది. ఎవడు చెప్పిండ్రా నేను మీడియం పేసర్నని గట్టిగా అరవాలనిపించేది.’ అని రసెల్ తన ఆవేదనను వెళ్లగక్కాడు.