సీఎం జగన్, నేను స్కూల్‌మేట్స్ : 'మహర్షి' దర్శకుడు

SMTV Desk 2019-06-01 13:48:43  vamsi paidipalli

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా, సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా అందించిన సినిమా మహర్షి . ఈ చిత్రం ఎపిక్‌ బ్లాక్‌ బస్టర్‌గా అఖండ ప్రజాదరణ పొందుతూ.. 100 కోట్ల షేర్‌ క్రాస్‌ చేసి ఇప్పటికీ సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది.

ఈ సందర్భంగా... దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ... భారతదేశ రాజకీయాల్లో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జగన్‌ గారు, నేను స్కూల్‌మేట్స్‌. ఇద్దరం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివాం. ఆయన మాకు సీనియర్‌. స్కూల్‌లో రెడ్‌ హౌజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించేవారు. అప్పటి నుండే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. మా మహర్షి టీమ్‌ తరపున వారిద్దరికీ శుభాకాంక్షలు.



మహర్షి నేనెప్పుడూ చూడనంత పెద్ద బ్లాక్‌ బస్టర్‌తో పాటు, మహేష్‌బాబు కెరీర్‌లోనే ల్యాండ్‌ మార్క్‌ మూవీగా నిలిచింది. ఏ నమ్మకంతో అయితే సినిమా స్టార్ట్‌ చేశామో.. ఈ రోజు ఆ నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకులు నిజం చేశారు. ఈ సినిమా విజయంతో పాటు మాకిచ్చిన గౌరవం మా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎక్కడికెళ్ళినా రైతులు తమ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మాకు ఒక గుర్తింపునిచ్చారన్నా అంటున్నారు. మాకెలా స్పందించాలో తెలియడం లేదు.

ఈ సినిమా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. రైతులను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే. సొసైటీలో ఇది చాలా ప్రభావం చూపి.. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే సినిమా అయినందుకు మా టీమ్‌ అందరికీ మా కృతజ్ఞతలు. ఈ విజయం వెనుక మా టీమ్‌ కృషి ఎంతో ఉంది. నాలుగోవారంలోకి వచ్చినా కూడా ఈ సినిమా గురించి మాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాను అభినందించిన ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ఇండస్ట్రీ ప్రముఖులకు మా టీమ్‌ అందరి తరపున ధన్యవాదాలు.