బ్రేకింగ్: ఏటా 20శాతం మద్యం షాపుల ఎత్తివేత!

SMTV Desk 2019-06-01 12:39:11  alcohol

తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన వైసీపీ చీఫ్ జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను దశల వారీగా ఎత్తివేసేలా సరికొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలాఖరుతో గత ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీ ముగియనుంది. ఈ నేపథ్యంలో జూలై నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. అయితే, ఈ విధానంలో పలు కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలున్నాయి. వీటిని ఒకేసారి రద్దు చేయకుండా ఏడాదికి 20 శాతం చొప్పున వచ్చే ఐదేళ్లలో మొత్తం దుకాణాలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫలితంగా మద్య నిషేధం హామీ అమలు చేసినట్టు అవుతుందని భావిస్తోంది.

మద్య దుకాణాలను ఎత్తివేయడం ద్వారా తగ్గే ఆదాయాన్ని వేరే మార్గాల్లో సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా లైసెన్స్ ఫీజులు పెంచడం, మద్యం రేట్లు పెంచడం వంటివాటిపై కసరత్తు చేస్తోంది. మద్యం రేట్లను భారీగా పెంచడం వల్ల తాగే వారి సంఖ్య తగ్గుతుందని, ఆ రకంగా కూడా మద్య నిషేధం కొంత వరకు అమలు అవుతుందని అంచనా వేస్తోంది.