లండన్: ప్రపంచకప్ ప్రారంభావేడుకల్లో పాల్గొన్న మలాలా భారత్ ను తక్కువ చేసి మాట్లాడింది. లండన్లోని బర్మింగ్హామ్ ప్యాలెస్ ఎదుట నిర్వహించిన టోర్నీ ఆరంభ వేడుకల్లో అన్ని దేశాల ప్రముఖులు, క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ 60 సెకన్ల ఛాలెంజ్ గల్లీ క్రికెట్ ఆడారు. టీమిండియా తరఫున మాజీ క్రికెటర్ అనిల్కుంబ్లే, బాలీవుడ్ దర్శకుడు, నటుడు ఫరాన్ అఖ్తర్ పాల్గొని 60 సెకన్ల గల్లీ క్రికెట్లో అన్ని జట్ల కన్నా తక్కువగా 19 పరుగులు చేశారు. ఇక ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు తరఫున మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, క్రిస్ హ్యూస్ పాల్గొని 74 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ 69 పరుగులు చేశారు. ఇదే సమయంలో పాకిస్థాన్ బ్యాట్స్మెన్ 38 పరుగులు చేయడంతో భారత్ కన్నా రెండింతలు ఎక్కువ సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన మాలాల... పాకిస్థాన్ పర్లేదు. మరీ దారుణంగా ఆడలేదు. భారత్లా చివరిస్థానం కాకున్నా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది అని ఎద్దేవా చేశారు. వెంటనే మళ్లీ అందుకొని.. క్రీడలు అందరినీ ఏకం చేస్తాయని, ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. భారత్పై మలాలా స్పందించిన తీరును నెటిజన్లు తప్పు పడుతున్నారు.