భారత్-యూఏఈ దేశాల మధ్య రెండు ఒప్పందాలు కుదరండంతో అక్కడి భారతీయ కార్మికుల వేతనాల పెరుగుదలతో పాటు మంచి ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయని ఇరు దేశాలకు చెందిన ఉన్నతస్థాయి దౌత్యాధికారులు వెల్లడించారు. భారత్ నుంచి దుబాయి, అబుదాబి, షార్జా వంటి యూఏఈలోని ఏడు రాజ్యాలకు కార్మికులు ఎక్కువగా ఉపాధి కోసం వెళ్తుంటారు. నైపుణ్యం కలిగిన కార్మికుల నియామకాలు ఇకపై ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. వివిధ రంగాల్లో నిపుణులైన కార్మికులకు ధ్రువీకరణ పత్రాలు జారీచేయాలని నిర్ణయించారు.కార్మికులను ఉద్యోగాలకు భర్తీచేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న భారత ప్రభుత్వానికి చెందిన ఇ-మైగ్రేట్ పోర్టల్ను యూఏఈ ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరేటైజేషన్ పోర్టర్తో అనుసంధానం చేస్తారు. దీంతో యజమానులు, ఉద్యోగులు, రెండు దేశాల ప్రభుత్వాలు, రిక్రూటింగ్ ఏజెన్సీలు ఒకే వేదికపైకి వస్తారు. వేతన ఒప్పందాల రికార్డుల నిర్వహణ, కార్మికుల సంక్షేమం, భద్రత సులువవుతుంది. గత సంవత్సరం లక్షా 37వేల మంది కార్మికులు భారత్ నుంచి యూఏఈ కి ఇ-మైగ్రేట్ పోర్టల్ ద్వారా పంపబడ్డారు. దేశంలోని తెలంగాణ ప్రాంతం నుంచి అనేక మంది కార్మికులు దుబాయికి పనికోసం వెళ్తుంటారు. ఈ కొత్త విధానంతో దళారుల ప్రమేయం తగ్గి వీసా మోసాలకు ఆన్లైన్ నియామకాలతో అడ్డుకట్ట పడుతుంది. పని వీసా లేకుండా యూఏఈ వెళ్లేవారి సంఖ్య తగ్గుతుంది. చట్టబద్ధమైన వలసలకు, భద్రత కలిగిన వేతనాలకు అవకాశముంటుంది.