కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 2014లో మోదీ టీమ్ తో పోలిస్తే, ప్రస్తుత టీమ్ ఎన్నో ప్రత్యేకతలను కలిగివుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఏఐఏడీఎంకే ఎంపీకి కేంద్ర కేబినెట్ లో స్థానం లభించింది. మంత్రివర్గంలో చోటుదక్కని ప్రముఖుల్లో మనేకాగాంధీ, రాధామోహన్ సింగ్, జయంత్ సిన్హా, అనుప్రియా పటేల్, రామ్ కృపాల్ యాదవ్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, అనంత్ కుమార్ హెగ్డే తదితరులున్నారు.
గత కేబినెట్ లో మంత్రులుగా ఉండి ఓడిపోయిన వారిలో మనోజ్ సిన్హా, అల్ఫోన్స్ కన్నంతనమ్, హన్స్ రాజ్ ఆహిర్ లున్నారు. గత క్యాబినెట్ లో మంత్రులుగా ఉండి, ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వారిలో సురేష్ ప్రభు, సుష్మా స్వరాజ్, ఉమా భారతి, బీరేంద్ర సింగ్, అరుణ్ జైట్లీలున్నారు.
ఓడిపోయినప్పటికీ పదవిని దక్కించుకున్న ఎంపీగా హర్దీప్ సింగ్ పురి నిలువగా, గత క్యాబినెట్ లో మంత్రిగా ఉండి టికెట్ ను పొందలేకపోయిన వ్యక్తిగా విజయ్ సంప్లా నిలిచారు. గత క్యాబినెట్ లో 8 మంది మహిళలుండగా, ఈ దఫా వారి సంఖ్య 6కు తగ్గింది. గరిష్ఠంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన 9 మందికి మంత్రి పదవులు లభించాయి.