న్యూఢిల్లీ, ఆగస్టు 28 : 2022 నాటికి నవ భారతం సృష్టించే దిశగా స్పష్టమైన లక్ష్యాలతో పని చేయాలని ఐఏఎస్ అధికారులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న మోదీ, మరో 80 మంది అధికారులతో భేటీ అయి ఈ మేరకు సూచించినట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. వ్యవసాయం, తాగునీరు, పౌరుల ఆధారిత పరిపాలన, పాలనలో సృజనా, సమిష్టి కృషి, విద్యుత్ తయారీ, అంతర్గత భద్రత, సౌర విద్యుత్ సహా వేరు వేరు కీలక అంశాలపై తమ అభిప్రాయాలని ఐఏఎస్ అధికారులు మోదీ తో పంచుకున్నారు. దేశంలో వైద్య పరికరాల తయారీ పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మోదీ వివరించారు. ప్రభుత్వంలో సభారత్మక పని వాతావరణం కొనసాగాలని ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించారు. కొత్త చట్టాలు రావడంతో, పాత చట్టాలను సమీక్షించి, అవసరమైన వాటిని రద్దు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జాతీయ స్థాయిలో అభివృద్ధి సూచనలను మెరుగు పరిచేందుకు దేశంలో అత్యంత వెనుకబడిన 100 జిల్లాలకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐఏఎస్ అధికారులకు ప్రధాని మోదీ నిర్దేశించారు.