టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తన ప్రమాణస్వీకారానికి చంద్రబాబును హుందాగా ఆహ్వానించారనీ, కానీ చంద్రబాబు మాత్రం దానికి వేరే స్టోరీ అల్లి మీడియాలో రాయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనాల్లో ‘మీ సలహాలు అవసరం. మీరు అనుభవజ్ఞులు’ అని జగన్ చెప్పినట్లు తప్పుడు మాటలు పుట్టించారని దుయ్యబట్టారు.
చంద్రబాబు అనుభవం రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే ఉపయోగపడిందని ఎద్దేవా చేశారు. ఇది గమనించిన ఏపీ ప్రజలు యువనేత జగన్ కు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడూ మారడని స్పష్టం చేశారు.
ఈరోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ....."ప్రమాణ స్వీకారానికి జగన్ గారు హుందాగా ఆహ్వానిస్తే దానికి వేరే స్టోరీ అల్లి మీడియాలో రాయించుకుంటావా? మీ సలహాలు అవసరం, మీరు అనుభవజ్ఞులు అని, ఆయన అనని మాటలు పుట్టిస్తారా? మీ అనుభవం దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించావని గ్రహించే యువనేతకు పట్టం కట్టారు ప్రజలు. నువ్వు మారవు బాబూ" అని విమర్శించారు.