రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీ పాకిస్థాన్కు ఝలక్ ఇచ్చారు. ‘పట్టాభిషేక వేడుక’కు మిగతా దేశాల అధినేతలను పిలిచిన మోదీ... దాయాది దేశం ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఆహ్వానం పంపకుండా తన వైఖరి ఏమిటో స్పష్టం చేశారు. ఈసారి ప్రమాణ స్వీకారానికి మోదీ సార్క్ను విస్మరించి ‘బిమ్స్టెక్’ దేశాలకు మాత్రమే ఆహ్వానం పంపారు.
ఈ నెల 30న జరిగే మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, కిర్ఘిస్థాన్ అధ్యక్షులు వరుసగా అబ్దుల్ హమీద్, సిరిసేన, యూ విన్ మింట్, జీన్బికోవ్, నేపాల్, భూటాన్, మారిషస్ ప్రధానులు కేపీ శర్మ, లొటే షెరింగ్, ప్రవింద్ కుమార్ జుగ్నౌథ్, థాయ్లాండ్ ప్రత్యేక దూత హాజరు కానున్నారు. వీరి రాకను ఖరారు చేస్తూ సమాచారం అందింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 12 రోజుల పాటు వేరే దేశాల పర్యటనకు వెళుతున్నందున రాలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు.