పాట్నా, ఆగస్ట్ 27: లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఆదివారం పాట్నాలో భారీ ర్యాలీ చేపట్టింది. దీనికి లాలు బీజేపీ భగావో, దేశ్ బచావో.. అనే నామకరణం కూడా చేశారు. ప్రధాన ప్రతిపక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, లెఫ్ట్ పార్టీల వాళ్లు కూడా హాజరయ్యారు. జనం కూడా ఓ మోస్తరుగానే సమావేశమయ్యారు. అయితే లాలు తమ బలం ఎంతుందో చూపెట్టడానికి మార్ఫింగ్ ఫొటోను ట్వీట్ చేశారు. గాంధీ మైదాన్ మొత్తం కార్యకర్తలతో నిండిందంటూ లాలూ ఫొటోషాప్లో మార్చిన ఫొటోను తన ట్వీట్ కోసం వాడుకున్నారు. ఈ విషయం అర్థమయిన నెటిజన్లు అసలు ఫోటోలను లాలుకి ట్యాగ్ చేశారు. కొందరైతే ఆ ఫోటోని ఇంకా మార్చి తమకు లాలు కంటే బాగా ఫోటో షాప్ తెలుసునని ఎద్దేవా చేశారు. వీరికి తోడు న్యూస్ ఏజెన్సీ ANI కూడా అసలు ఫోటోలను ట్వీట్ చేసింది. దీంతో లాలు పరువు పోవడమే కాకుండా కొత్త ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. ప్రతి పక్షాలన్నిటినీ ఏకం చేయాలనే ఉద్దేశ్యంతో లాలు ఈ ర్యాలీ నిర్వహించారు.