కాకినాడ, ఆగస్ట్ 27: గత ఎన్నికల్లో కాకినాడకు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నేరవేర్చని చంద్రబాబు ఇప్పుడు నగరాన్ని అభివృద్ధి చేస్తాను అనడం హాస్యాస్పదం అని వైసీపీ అధినేత జగన్ ఎద్దేవా చేసారు. ఎన్నికలు ఎక్కడ ఉంటే మన ముఖ్యమంత్రి అక్కడ కనిపిస్తారని ఆయన తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సీఎం మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు విన్నవించారు. మొన్న నంద్యాల ఉప ఎన్నికలప్పుడే దానిని స్మార్ట్ సిటీ చేస్తానని చంద్రబాబు చెప్పారని, గతంలో కర్నూలులో కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పారని, ఇప్పుడు.. కాకినాడను అద్భుతంగా చేస్తామంటూ చంద్రబాబు ప్రకటించడం ప్రజలు గమనించాలని జగన్ పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోలియం యూనివర్శిటీ స్థాపిస్తామని, కాకినాడలో మరో పోర్ట్ ఏర్పాటు చేస్తామని, పెట్రో కారిడార్, కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమలు, నౌక నిర్మాణ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన హామీలు ఇప్పుడు ఆయనకు గుర్తులేవంటూ జగన్ విమర్శించారు.