కాకినాడ, ఆగస్ట్ 27: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం రెండవ రోజు కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్ష నేత జగన్ను గుర్మీత్ సింగ్ అలియాస్ డేరా బాబాతో పోల్చారు. జగన్ తీరు చిన్నప్పటి నుంచి అంతేనని, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏదైనా మాట చెబితే.. టీవీలు పగలగొట్టేవాడని చంద్రబాబు విమర్శించారు. దీంతో ఓపిక నశించిన వైఎస్ రాజశేఖర్రెడ్డి కొడుకుని బెంగళూరుకు పంపించాడని ఆయన తెలిపారు. నంద్యాలలో ఓటమి భయంతో జగన్కు ముందుగానే జ్వరం వచ్చిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. నిత్యం తాను సామాన్య మానవుడికి అండగా ఉంటానని, కాకినాడకు పూర్వ వైభవం తీసుకొచ్చి, మరింత అభివృద్ధి పధం వైపు నడిపిస్తానంటూ ఆయన భరోసా ఇచ్చారు. ఇక్కడి ప్రజలు కన్నెర్రజేస్తే వైసీపీకి ఒక్క సీటు రాదని, మొత్తం అన్ని స్థానాల్లో టీడీపీయే గెలవాలని, టీడీసీ-బీజేపీ అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతునివ్వాలని ఆయన విన్నవించారు.