ఏపీకి కొత్త సీఎంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణం స్వీకారం చేయనుండటంతో విజయవాడ వినూత్నంగా ముస్తాబౌతుంది. అలాగే.. జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్... తమిళనాడు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ విచ్చేయనున్నారు. దీంతో ఆరోజు ఉదయం బెజవాడ కనకదుర్గమ్మను తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీకి కాబోయే సీఎం జగన్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్లు ముగ్గరు ఒకేసారి దర్శించుకోబోతున్నట్లు ఆలయ ఈవో కోటేశ్వరమ్మ వెల్లడించారు.
అదేవిధంగా ఈ ముగ్గురూ ఒకేసారి కలిసివచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారని తెలిపిన ఆమె రేపు రాత్రి 7 గంటలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. అమ్మవారిని దర్శించుకోబోతున్నట్లు వివరించారు. కాగా.. ఆలయంలో లగేజీ, చెప్పులు, ఫోన్లను ఇక నుంచి ఉచితంగా భద్రపరుస్తామని కోటేశ్వరమ్మ వివరించారు.
కాగా ఇప్పటివరకు జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వస్తారని తెలుసుగానీ.. స్టాలిన్ కూడా వస్తారని ఇప్పుడే సమాచారం అందుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.