ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న నేపధ్యంలో తిరుమల కొండ మీద నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని పుట్టా సుధాకర్ యాదవ్ తేల్చి చెబుతున్నారు. పాలకమండలికి మరో ఏడాది గడువుందని గత ప్రభుత్వం తమను పాలకమండలిగా నియమించిందని, తమంతట తాము రాజీనామా చేసే ప్రసక్తిలేదని, అవసరమైతే ప్రభుత్వమే పాలకమండలిని రద్దు చేసుకోవాలని ఆయన చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం బోర్డును రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న తరువాత మాత్రమే తాను పదవిని వీడుతానని ఆయన అన్నారు. స్వచ్ఛందంగా బోర్డును వీడేందుకు అత్యధిక సభ్యులు సుముఖంగా లేరని చెబుతున్నారు. ఈరోజు తిరుమలలో పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 21 పాలకమండలి సభ్యులకు గాను ఏడుగురే హాజరయ్యారు. ఈ సమావేశానికి వచ్చిన ఈవో సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు మధ్యలోనే బయటకు వచ్చేశారు. తమ సమావేశానికి అధికారులు హాజరుకాలేదని, వారు బహిష్కరించారనిపుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం మారిపోయిన తర్వాత సహజంగా నామినేటెడ్ పోస్టుల్లో నియమితులైన వారు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారు. మరి టీడీపీ నేత అయిన పుట్టా ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.