కేంద్రంలో వైసీపీకి....రాష్ట్రంలో బీజేపీకి - మంత్రి పదవులపై చర్చ!!

SMTV Desk 2019-05-28 16:45:40  ysrcp

మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, లు ప్రత్యక్షంగా ఒకరికి ఒకరు పొత్తు పెట్టుకోకపోయినా ఈ రెండు పార్టీల మధ్య సత్సబంధాలు ఉన్నాయనే చర్చ రాజకీయ శ్రేణుల్లో జోరుగా సాగుతుంది. ఏపీలో విజేతగా నిలిచిన జగన్ కు ప్రధాని ఫోన్ చేయడం....ఆ తరువాత జగన్ ప్రధానితో భేటీ అవ్వడం పరిపాలనలో ఒకరికి ఒకరు సహకరించుకోవాలనుకోవడం ఇవన్నీ ఈ రెండు పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తున్నాయి.

ఏపీ ఎన్నికల్లో బీజేపీ కూడా బరిలోకి దిగింది...కానీ ఒక్క స్థానాన్ని కూడా సంపాదించలేకపోయింది. అయినా ఇప్పుడు ఏపీలో కొత్తగా ఏర్పడబోయే జగన్ ప్రభుత్వంలో బీజేపీకి కూడా చోటు దక్కుతుందనే కొత్త టాక్ మొదలయ్యింది. గత కొద్ది రోజులుగా బీజేపీ నాయకులు ఇస్తున్న స్టేట్ మెంట్స్ ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

తరచూ ప్రభుత్వంలో భాగస్వామ్యం అనే పదం బీజేపీ నేతలు ఎక్కువగా వాడేస్తున్నారు. గత రెండు, మూడు రోజులుగా ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌లు అదే పనిగా మీడియాతో మాట్లాడుతున్నారు. వీరి మాటల్లో ఎక్కడో చోట తాము ప్రభుత్వంలో భాగం అవ్వడం ప్రధాన అంశం కాదని చెబుతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఢిల్లీలో అమిత్ షా, రామ్‌ మాధవ్‌లతో జగన్ చర్చలు జరిపారు. ఏపీలోని సమస్యల పరిష్కారానికి తగిన సహాకారం అందించాలని జగన్ మోదీకి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. అమిత్ షాతో కలిసిన తర్వాత రామ్‌మాధవ్ ప్రత్యేకంగా ఏపీ భవన్‌కు వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. ఇక ఆ భేటీ తరువాత దగ్గర నుంచి ఈ పుకారు షికారు చేయడం మొదలయ్యింది.

ఏపీ ప్రభుత్వంలో బీజేపీ, ఎన్డీఏలో వైసీపీ చేరుతుందని ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయంపై నోరు మెదిపేందుకు ఏ ఒక్క నేత సాహసం చేయడంలేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే ఇవన్నీ నిజమే అన్నట్టుగా ఉంది. వాస్తవంగా చూస్తే కేంద్రంలో ప్రతి రాష్ట్రానికి భాగస్వామ్యం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతీ రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా ఒకరికో ఇద్దరికో కేంద్రమంత్రి పదవులు ఇవ్వడం ఖాయం.

బీజేపీకి ఇప్పుడు కేంద్రమంత్రి పదవులు ఇవ్వడానికి ఏపీలో ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో కేంద్రంలో మంత్రి పదవుల ఇచ్చేందుకు వీలుగా వైసీపీని ఎన్డీఏలో చేర్చుకుని, వైసీపీ ఎంపీలకు మంత్రి పదవులు ఇస్తే బాగుంటుందన్న భావన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ఆ విధంగానే ఏపీ ప్రభుత్వంలో బీజేపీకి రాష్ట్రంలో మంత్రి పదవులు ఇప్పించుకోవాలని బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది.

కాకపోతే ఏపీలో బీజేపీ నాయకులు ఎవరూ ఎమ్మెల్యేలుగా గెలవలేదు. ఇద్దరికి మాత్రం ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయి. సోము వీర్రాజు తో పాటు, పీవీ మాధవ్ కూడా ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఒకవేళ ఇదంతా జరిగితే ఈ ఇద్దరికీ మంత్రి పదవులు దక్కొచ్చు అనే సమాచారం.