గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేసిన స్టీఫెన్ రవీంద్ర తన వద్ద కూడా పని చేయాలని జగన్ కోరుకుంటున్నారు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడిన నేపథ్యంలో స్టీఫెన్ ను ఏపీకి తీసుకోవాలని భావిస్తున్న జగన్, ఆయన్ను డిప్యుటేషన్ మీద తమ రాష్ట్రానికి పంపించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖకు ఆయన ప్రత్యేకంగా కోరారు. అందుకు హోమ్ శాఖ సానుకూలంగా స్పందించిందని, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గానూ ఆయన పేరు దాదాపు ఖరారైందని, ఒకటి, రెండు రోజుల్లోనే ఆయన విజయవాడకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తారని సమాచారం.
జగన్ విజ్ఞప్తి మేరకు ఆయన్ను కేంద్ర హోంశాఖ ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా నియమించింది. రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలతో పాటు ఉగ్రవాద, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. చాలా నిక్కచ్చిగా పనిచేసే అధికారిగా ఆయనకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉన్న స్టీఫెన్ రవీంద్రను జగన్ ఏరికోరి ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలను స్టీఫెన్ రవీంద్ర చేపట్టవచ్చని సమాచారం.