తాజాగా వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 175 స్థానాలకు గాను జనసేన కూటమి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. తాజాగా నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన నాగబాబు మై ఛానల్ నా ఇష్టం పేరుతో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసీపీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డికి నాగబాబు అభినందనలు తెలిపారు. ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. తమ సహకారం జగన్కు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
ఇంత భారీ మెజారిటీ ఇచ్చినందుకు ప్రజలకు జగన్ రుణపడి ఉన్నారని నవరత్నాలు కాన్సెప్ట్ను, ఇచ్చిన హామీలను ఈ ఐదేళ్లలో చేసి చూపించాలని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. ఇక జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ జనసైనికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. జనసేన గెలవలేకపోచ్చు.. నైతికంగా మాత్రం మనం గెలిచాం. ఇంకా మంచి మార్పు తీసుకొద్దాం’ అని అన్నారు. జనసైనికులు, వీర మహిళలు జనసేనను ముందుండి నడిపించారని, అయితే ఫలితాలు చూసి వీరంతా చాలా భావోద్వేగాలకు గురయ్యారని నాగబాబు చెప్పారు. ఒక నెల పాటు రిలాక్స్ అవ్వండి. జనసైనికులు, వీర మహిళలు మీ మీ భార్యలు, భర్తలతో కలిసి సరదాగా వెకేషన్స్కి వెళ్లండి. మీ ఒత్తిడిని మీ శరీరంలో నుంచి తీసేయండి. ఈలోగా మన నాయకుడు కార్యచరణ రూపొందిస్తాడని నాగబాబు సలహా ఇచ్చారు