పెరూ: ఉత్తర-మధ్య పెరూలో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 8.0గా నమోదైందని యూఎస్ భూగర్భ పరిశోధన సంస్థ తెలిపింది. ఆగ్నేయ ల్యాగునాస్కు 80 కిలోమీటర్ల దూరంలో, యురీమ్యాగ్వాస్ నగరానికి 158 కిలో మీటర్ల దూరంలో 114 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ భూకంపంపై పెరూ ప్రభుత్వం స్పందించింది. రిక్టర్ స్కేల్ పై మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది. లిమా, కల్లావూ ప్రాంతాల్లో భూమి కంపించిందని ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి సునామీ ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. రెండు నుంచి మూడు నిమిషాల పాటు భూకంపం రావడంతో తాము భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని భూకంప ప్రభావిత ప్రాంత ప్రజలు చెప్పారు. అయితే ఈ భూకంపం వల్ల భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలిసింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.