ఏపీకి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై నమోదైన కేసులన్నీ కుట్రలే అనీ.. ఆధారం లేనివే అని అన్నారు. ఢిల్లీలో మీడియాతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. శుక్రవారం కోర్టుకు హాజరవుతారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తనపై పెట్టిన కేసులేవీ నిలబడేవి కాదన్నారు. ఈ కేసులన్నీ వీగిపోతాయని అన్నారాయన.
నాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నంత కాలం తనపై కేసులేమీ లేవన్నారు. ఆయన చనిపోయిన తర్వాత… తాను పార్టీ పెట్టినప్పటినుంచే.. అటు కాంగ్రెస్ నాయకులు.. అటు టీడీపీ నాయకులు.. తనపై కక్ష కట్టి పిటిషన్లు వేశారన్నారు. పిటిషనర్లంతా కాంగ్రెస్, టీడీపీ నాయకులే అని అన్నారు. అలాంటి వారు పెట్టిన కేసులు నిలబడవు అన్నారు. ఈ సంగతులన్నీ ఆంధ్రప్రజలకు తెలుసు కాబట్టే తనకు ఇంతటి భారీ విజయం కట్టబెట్టారని.. ప్రజాకోర్టులో నిర్దోషిలా నిరూపించుకున్నానని జగన్ అన్నారు. కోర్టులకు సహకరిస్తానని చెప్పారు.
ఏపీలో మద్యపాన నిషేధం ఒక్కసారిగా కాదు కానీ.. విడతలుగా అమలు చేస్తానని చెప్పారు వైఎస్ జగన్. 3, 4 ఏళ్ల తర్వాత ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే మద్యం దొరికే రోజులు వస్తాయని చెప్పారు. మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతే.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతా అని జగన్ అన్నారు.