పాట్నా, ఆగస్ట్ 26: అల్లకల్లోలంగా మారిన బిహార్ వరద ముంపు ప్రాంతాలలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ నష్టాల నుండి గట్టెక్కడానికి రాష్ట్రానికి ప్రధాని 500 కోట్ల రూపాయిల తక్షణ సహాయాన్ని ప్రకటించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయిల చొప్పున, గాయపడిన వారికి 50 వేల రూపాయిల చొప్పున పరిహారాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఈ సర్వేలో ఆయనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో వరద భీభత్సాన్ని, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను మోదీ సమీక్షించారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి వెంటనే కేంద్ర బృందాన్ని పంపనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఈ భీభత్సం కారణంగా సుమారు 2 కోట్ల మంది ఛిన్నాభిన్నమయ్యారు. 415 మంది ప్రాణాలు కోల్పోయారు. ముజఫర్నగర్, సమస్తిపుర్, దర్భంగా జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది.