నమ్మిన వాడే మోసం చేస్తాడు... అవును. అతణ్ని తన వాళ్లే మోసం చేశారు. కనీసం తన ఇంట్లో వాళ్లు, బంధువులు, చుట్టు పక్కల వాళ్లైనా ఓట్లేస్తారేమోనని లోక్సభ బరిలో దిగిన అతనికి ఐదంటే ఐదే ఓట్లొచ్చాయి. దీంతో తన ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అయింది. అతని పేరు నీతూ శటరాంవాలా. పంజాబ్లోని జలంధర్ లోక్సభ స్థానానికి పోటీ చేశాడు. గెలుస్తానని నమ్మకం లేకపోయినా కొన్ని ఓట్లైనా రాకపోతాయా అనుకున్నాడు. తీరా లెక్కింపు సమయంలో చూస్తే 5 ఓట్లు వచ్చాయి. దీంతో ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘నా కుటుంబసభ్యులే 9 మంది. కానీ నాకు 5 ఓట్లు వచ్చాయి. నా ఇంట్లో వాళ్లే నన్ను మోసం చేశారు’’ అని ఇంటర్వ్యూలోనే అతను బోరున విలపించాడు.