సార్వత్రిక ఎన్నికల్లో పరాజయపాలైన కాంగ్రెస్ భవిష్యత్తు కార్యాచరణపై తాజాగా ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అయితే ఈ సమావేశానికి మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ డుమ్మాకొట్టారు. కాగా ఈ సమావేశానికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే తదితర కీలక నేతలంతా హాజరయ్యారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, అమరీందర్ సింగ్, భూపేశ్ బాఘెల్ కూడా సీడబ్ల్యూసీ సమావేశంలో ఉన్నారు. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రపాలిత రాష్ట్రమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కూడా సీడబ్ల్యూ సమావేశానికి రావాల్సిందిగా సమాచారం అందింది. అయితే కీలకమైన ఈ సమావేశానికి సీఎం కమల్ హజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రేపు మధ్యప్రదేశ్ లో సీఎల్పీ సమావేశం ఉన్నందువల్లనే సీడబ్ల్యూసీ సమావేశానికి కమల్ నాథ్ రాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.