చండీఘడ్, ఆగస్ట్ 26 : గుర్మీత్ రామ్ రహీం సింగ్ బాబా సాధ్విలపై అత్యాచారం చేసిన కేసులో పంచకుల సీబీఐ కోర్టు బాబా దోషే అంటూ తీర్పునిచ్చింది. ఈ నేపధ్యంలో ఈ నెల 28న శిక్షను ఖరారు చేయవలసి ఉంది. కాని ప్రస్తుత౦ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం వల్ల శిక్షను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఖరారు చేయాలను నిర్ణయానికి వచ్చారు. ఆయనపై నమోదైన అభియోగాలపై బాబాకు సుమారు ఏడేళ్ళ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాని తనకు జీవిత ఖైదు విధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ చెబుతున్నారు. అయితే ఈ తీర్పు వెలువడిన అనంతరం జరిగిన హింస కాండలో ఇప్పటివరకు దాదాపు 30 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరో 250 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఆయనను దోషిగా ప్రకటించిన అనంతరం బాబా అనుచరులు పంజాబ్, హరియాణాల్లో విధ్వంసం సృష్టించారు. పలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో పంజాబ్, హరియాణా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గుర్మీత్ అనుచరుల దాడిలో కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఆయన ఆస్తులను అటాచ్ చేయాలని ఆదేశాలను జారీ చేసింది.